
హనుమకొండ, వెలుగు: తెలంగాణలో అధికారంలోకి రావడమే వాజ్పేయికి ఇచ్చే నిజమైన నివాళి అని మాజీ గవర్నర్, బీజేపీ నేత సీహెచ్విద్యాసాగర్రావు పేర్కొన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా హనుమకొండ హంటర్రోడ్డులోని డీ కన్వెన్షన్సెంటర్ లో ఆదివారం నిర్వహించిన ‘అటల్ జీ యాదిలో..’ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన చీఫ్గెస్ట్ గా హాజరై మాట్లాడారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ విస్తరిస్తోందన్నారు. కానీ తెలంగాణలో ఎందుకు సాధ్యం కావడం లేదో ఇక్కడి నేతలు ఆలోచించుకోవాలని సూచించారు.
పోరాటాల ఖిల్లా ఓరుగల్లు జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలవాలని, ఆ దిశగా నేతలు ఇప్పటినుంచే ప్లాన్ రెడీ చేసుకుని ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఓరుగల్లు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, అందుకే ఎన్నో పథకాలను ఇస్తోందని చెప్పారు. - వాజ్పేయి పేరిట వరంగల్ లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, గంట రవి కుమార్, అటల్జీ శతజయంతి ఉత్సవాల కో –ఆర్డినేటర్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, మాజీ మేయర్ టి.రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల అధ్యక్షులు నిశిధర్ రెడ్డి, బలరాం, వెంకటేశ్వర్లు, సోడా రమేశ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.